Monday, May 25, 2009

చాప్టర్ టూ: మిద్దెల పార్వతి (పాపులర్లీ నోన్ యాజ్ "పారు") - సివంగి ఆఫ్ పెంబర్తి.

పార్ట్ 3
పార్వతి
ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్.

రామనాథ శర్మ గారి ఒక్కొక్క మాట సమ్మెట పోట్ల లాగా ఇంకా అందరి మనసులని తొలిచేస్తున్నాయి. ఇంట్లో జరిగిన తతంగం ఏమీ తెలియని పార్వతి ఎప్పటిలాగే అల్లరి చిల్లరగా చిలిపి పనులు చేస్తూనే ఉంది. మెల్లిగా రెండ్రోజులు గడిచిపోయ్యాయి. బాగా ఆలోచించుకున్న గణపతయ్య ఒక రోజు భోజనాల వేళ తన మనసులోని విషయాన్ని అందరిముందూ పెద్ద కొడుక్కి చెప్పాడు. ఎప్పటి లాగానే పారు తన తోటి స్నేహితురాళ్ళతో ఏ షికారుకో బయలుదేరి యమ బిజీగా ఉండడంచేత ఇంట్లో లేదు.

శంకరా, బాగా ఆలోచించిన్తరువాత, నేనొక నిర్ణయానికొచ్చాను. మన పారుని పట్నం పంపిచేద్దాం. ఇంజనీరింగు ఎలాగూ పూర్తి చేసింది కాబట్టి, హైదరాబాదులో ఉన్న మన మోహన్ తో మాట్లాడి, వాడికి తెలిసిన ఏదైనా కంపెనీలో పారుకి ఉద్యోగం వచ్చేలా చూస్తా. ఒక సంవత్సరం పాటు పారు మోహన్ వాళ్ళింట్లోనే ఉండనీ. మోహన్ కూతురు శైలజ మన పారుకి బాగా తెలుసు కదా, ఒకరికొకరు తోడుగా ఉంటారు మరి. అప్పుడప్పుడూ మనమే హైదరాబాదుకి వెళ్లి పారుని కలిసొద్దాము. ఇక అంతా ఆ మల్లన్న దయ. ఏమంటావు రా?

అనడానికేమీ లేదు నాన్నా. మీరు ఏది చెప్పినా పారు మంచికోసమేనని అందరకీ తెలుసు. మాకేమీ అభ్యంతరం లేదు. కానీ పారు దీనికి ఒప్పుకుంటుందా అనీ...

దానికి నేను సర్దిచెపుతాను కదరా పెద్దోడా. నువ్వేమీ దిగులు పడకుండా నిశ్చింతగా ఉండు. అది పట్నం వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండండని పెద్ద పార్వతమ్మ భరోసా ఇచ్చింది. కానీ ఒక్క విషయం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి... హైదరాబాదుకి వెళ్లనని నానా రభసా చేస్తుంది పార్వతి. ఇంట్లో ప్రతి ఒక్కరూ నా మాటమీదే ఉండాలి కాని, దీని మాటల్లో పది గారాబం చేసారో, ఇంక నేనూరుకునేదిలేదు. తెల్చిచేప్పేసింది పెద్ద పార్వతమ్మ. అవునన్నట్టుగా తలూపారు అందరూ.

ఇదంతా ఏమీ తెలియని పారు తాపీగా సాయంకాలం ఇంటికి చేరింది. వచ్చీ రాగానే బామ్మని వాటేసుకుని రోజంతా వెలగబెట్టిన విషయాలన్నీ పూస గుచ్చినట్టుగా చెబుతూ ఉంది. ఓపికగా విన్నతరువాత మెల్లిగా చెప్పాలనుకున్నదంతా మూడు ముక్కల్లో చెప్పెసింది పెద్ద పార్వతమ్మ (అయితే శర్మ గారు చెప్పిందల్లా కాకుండా, చదువుకున్నందుకు ఉద్యోగం చెయ్యాలన్నట్టుగా!). అనుకున్నట్టుగానే పారు కోపంగా కాదు పోమ్మంటూ తాతయ్య దెగ్గరికి పరుగు తీసింది. తాతయ్య కూడా అదే మాట చెప్పడంతో ఇంకా ఉడికిపొయ్యింది పారు. అలా ఇంట్లో అందరూ ఒకే తాటిపై ఉండడంచేత అలిగి బుంగ మూతి పెట్టుకుని తన గదికి వెళ్ళిపోయింది కళ్ళల్లో నీళ్ళతో.

మరుసటి రోజు కూడా పరిస్థితి ఏమాత్రం మారకపోవడంచేత, ఇక వేరేదారిలేదని గ్రహించిన పారు, అమ్మమ్మ దెగ్గరికి వెళ్లి తాను హైదరాబాదుకి వెల్తాననీ, అయితే ప్రతీ వారం తనను చూడడానికి అందరూ రావాలనీ, బస్సుల్లో తిరగననీ, ఒక స్కూటీ బండి కావాలనీ, ఇంకో పదహారు కండీషన్లు పెట్టింది. అన్నింటికీ వప్పుకునే సరికి పారు సరేనంది. ఇక మరుసట్రోజే హైదరాబాదు ప్రయాణానికి ఇంటిల్లిపాదీ సిద్ధమయ్యింది.

టు బి కంటిన్యూడ్...

No comments:

Post a Comment